న్యూఢిల్లీ: టిబెట్పై తమ పోరాటం రాజకీయ అంశమే కాదని, ఇందులో సత్యం, నిజాయితీ ఉన్నాయని టిబెట్ ఆధ్యాత్మిక నేత 14వ దలైలామా అన్నారు. 1935 జూలై 6న జన్మించిన ఆయన టిబెట్ స్వంతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1959లో చైనా నుంచి ప్రాణ హానిని తప్పించుకుని భారత్లోకి ప్రవేశించారు. నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్న ఆయన బుధవారం 87వ ఏట ప్రవేశించారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని టిబెటన్ ప్రవాస ప్రభుత్వానికి బాటవేసి మార్గదర్శిగా ఉన్న దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర సీఎంతోపాటు పలువురు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, టిబెట్ ప్రవాస ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సీటీఏ) ధర్మశాలలో దలైలామా 87వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టిబెట్కు సంబంధించి తమ పోరాటం కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదని అన్నారు. ఈ పోరాటంలో సత్యం, నిజాయితీ కూడా ఉన్నాయని తెలిపారు. టిబెటన్ల వైపు నిజం నిలిచి ఉందన్నారు. ‘మేం అబద్ధాలు చెప్పడం లేదు. మా పోరాటంలో నిజాయితీగా ఉన్నాం. కాబట్టి ఇన్నాళ్లూ నేను నిజాయితీగా చట్టాన్ని గౌరవిస్తూ పనిచేశాను. టిబెటన్ సమస్య రాజకీయ అంశం మాత్రమే కాదు, సత్యం కూడా’ అని ఆయన అన్నారు.
మరోవైపు శాంతి, సామరస్యం, అహింసకు చిహ్నంగా దలైలామా విశ్వవ్యాప్తంగా ఖ్యాతి పొందారు. ప్రపంచ రాజకీయ, మత, సామాజిక నాయకులలో ఒకరిగా ఆయన ప్రాముఖ్యతను పొందారు. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామా టిబెటన్ స్వాతంత్ర్య ఉద్యమానికి అంతర్జాతీయంగా విస్తృత మద్దతును కూడా కూడగట్టారు. చైనా అప్రజాస్వామ్య, మానవత్వ వ్యతిరేక వైఖరిని ప్రపంచ వేదికలపై ఎండగట్టారు. చైనా పాలనలో టిబెటన్లపై కొనసాగుతున్న అణచివేత వాస్తవ రూపాన్ని ప్రపంచానికి తెలియజేశారు.