న్యూఢిల్లీ: తమిళనాడులోని మధురైలో ఉన్న తిరుపుండ్రం కొండపై కార్తీక దీపాన్ని(Karthigai Deepam) వెలిగించకుండా స్థానిక ప్రభుత్వం భక్తులను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ అంశంపై ఇవాళ లోక్సభలో దుమారం చెలరేగింది. సుబ్రమణ్యస్వామి ఆలయ శిఖరంపై ప్రతి ఏడాది తరహాలో కార్తీక దీపాన్ని వెలగించేందుకు వెళ్లిన భక్తులను ఎందుకు అడ్డుకున్నారని బీజేపీ నిలదీసింది. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణలను డీఎంకే నేత ఖండించారు. తమిళనాడులో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నదని టీఆర్ బాలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కిపెడుతోందన్నారు.
తిరుపుండ్రం కొండపై వెలిగించే కార్తీక దీపం అంశాన్ని లేవనెత్తేందుకు డీఎంకే సభ్యులు ఇవాళ లోక్సభ వెల్లోకి దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేశారు. ఇదే అంశాన్ని మళ్లీ జీరో అవర్లో లేవనెత్తారు. తిరుపుండ్రం కొండపై కార్తీక దీపాన్ని వెలిగించ్చుకోవచ్చు అని మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. దాన్ని తమిళనాడు సర్కారు వ్యతిరేకిస్తున్నది. కొండపై దీపాన్ని ఎవరు వెలిగించాలి, హిందూ దేవాదాయశాఖ బోర్డు సభ్యులా లేక హైకోర్టు జడ్జి తీర్పును పట్టుకుని తిరుగుతున్నవాళ్లా అని బాలు అడిగారు. జడ్జి ఐడియాలజీతో తీర్పు ఇచ్చినట్లు ఆయన కామెంట్ చేయడాన్ని కేంద్ర మంత్రి మురుగన్ తప్పుపట్టారు. పూజా హక్కును తమిళనాడు ప్రభుత్వం అణిచివేసిందని మంత్రి ఆరోపించారు.