శ్రీహరికోట, ఫిబ్రవరి 10: చిన్న ఉపగ్రహ వాహకనౌక(ఎస్ఎస్ఎల్వీ) సెగ్మెంట్లో ఇస్రో మొదటి విజయాన్ని సాధించింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈఓఎస్-07, జానుస్ -1, ఆజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత ఏడాది చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ డీ1 ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ వైఫల్యానికి కారణాలను విశ్లేషించుకొనిఎస్ఎస్ఎల్వీ డీ2ను ఇస్రో ప్రయోగించింది.
ఎస్ఎస్ఎల్వీ డీ2 కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 3 ఉపగ్రహాల్లో ఒక దానిని దేశవ్యాప్తంగా 750 మంది పాఠశాల విద్యార్థినులు తయారుచేశారు. ఇందులో తెలంగాణ విద్యార్థినులు కూడా ఉన్నారు. ఈ శాటిలైట్కు ‘ఆజాదీశాట్-2’ అనే పేరు పెట్టారు.