ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota) నుంచి రాకెట్ను ప్రయోగించనుంది. పూర్తి వాణిజ్య పరంగా చేపడుతున్న ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ను శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభించింది. ఇది 24.30 గంటలపాటు కొనసాగనుంది.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్వెబ్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా మొదటి దశలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్ 23న జీఎస్ఎల్వీ-మార్క్ 3 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తాజాగా మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించనుంది. 20 నిమిషాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన అనంతరం రాకెట్లో ఉంచిన 5,805 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి పంపనున్నారు. వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు.