శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. దేశంలో తొలిసారిగా జియో- ఆర్బిట్లోకి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2,300 కిలోలకుపైగా బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. మిషన్లో పాల్గొన్న ఓ సీనియర్ శాస్త్రవేత్త అభివర్ణించినట్లుగా ‘ఆకాశంలో కన్ను’గా అభివర్ణిస్తున్న ఈ ఉపగ్రహం రియల్ టైమ్ చిత్రాలను అందించనుంది. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ తదితర రంగాల్లో దేశానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఈవోఎస్-05 ఉపగ్రహాన్ని ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉద్దేశించిన సబ్ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటించింది.
‘గూఢచారి ఉపగ్రహం’ కాదు
ఈవోఎస్-05ను ‘గూఢచారి ఉపగ్రహం’గా పేర్కొంటూ వస్తున్న ఊహాగానాలను అంతరిక్ష సంస్థ తోసిపుచ్చింది. స్పై అనేది ప్రతికూల పదమని ఇస్రో చైర్మన్ నారాయణన్ అన్నారు. ఈవోఎస్-05ను భారత్ను నిరంతరం స్కాన్ చేసి, పరిశీలించేందుకు రూపొందించిన బహుముఖ ప్రయోజన వేదికగా ఆయన పేర్కొన్నారు. ఇది అందించే డేటా దేశ పౌరుల భద్రత, రక్షణను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని, ఈ ఉపగ్రహాన్ని తొమ్మిదేండ్ల పాటు పనిచేసేలా రూపొందించారని తెలిపారు. ‘జీఎస్ఎల్వీ ఎఫ్-17’ వాహనం అధునాతన ఈఓఎస్-05 జియో ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉందన్నారు.
భూ భ్రమణ వేగానికి సమానంగా..
ప్రస్తుతం అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు లో ఎర్త్ ఆర్బిట్(ఎల్ఈవో)లో పనిచేస్తున్నాయి. అయితే ఈవోఎస్-05 భూమికి సుమారు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింగ్రోనస్ ఆర్బిట్లోకి చేరనుంది. ఆ ఎత్తులో ఉపగ్రహం భూమి భ్రమణ వేగంతో సమానంగా ప్రయాణిస్తుంది. దీనికి ముందు బుధవారం రాత్రి 23:30 గంటలకు ప్రారంభమైన 27 గంటల కౌంట్డౌన్ సజావుగా ముగిసిన అనంతరం రాకెట్ శుక్రవారం తెల్లవారుజామున 2: 55 గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నిర్ణీత సమయానికి దూసుకెళ్లింది. 2026లో ఇస్రోకు ఇది తొలి విజయవంతమైన ప్రయోగం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.