Somnath | చంద్రుడిపైకి వెళ్లి వచ్చేందుకు.. భవిష్యత్లో మానవ ప్రయోగాల కోసం భారీ పేలోడ్ సామర్థ్యం ఉన్న రాకెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ అన్నారు. ఇండియా స్పేస్ కాంగ్రెస్-2024లో బుధవారం ఆయన మాట్లాడుతూ భారత్లో ఉపగ్రహ ప్రయోగ మార్కెట్తో తగినంత దేశీయ డిమాండ్ లేదన్నారు. శాటిలైట్ టెక్నాలజీ అప్లికేషన్పై మరింత పని చేసి డిమాండ్ను పెంచవచ్చన్నారు. బడా కంపెనీలు స్పేస్సెక్టార్ రంగంలోకి రావాలనుకుంటున్నాయని.. అయితే, సమయపాలనపై ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇక్కడికి వచ్చి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలతో మాట్లాడిన సమయంలో వారంతా అందుకు సిద్ధంగా ఉన్నారని సోమ్నాథ్ తెలిపారు. భారీ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను ఒప్పించడం పెద్ద సవాలేనని ఇస్రో చైర్మన్ అన్నారు.
దేశీయంగా మరింత డిమాండ్ను సృష్టించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఉపగ్రహాలు, లాంచర్లను నిర్మించడానికి పరిశ్రమలకు ఇవ్వగల కక్ష్య స్లాట్లు, ఫ్రీక్వెన్సీలను కనుగొనాలనుకుంటున్నామని.. అంతర్గత డిమాండ్ను సృష్టించేందుకు ఇది మొదటి అడుగని తెలిపారు. కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ గ్రూప్ను రూపొందించడానికి ఇన్స్పేస్ ఇప్పటికే నిధులను ప్రకటించిందని.. దేశీయంగా డిమాండ్ను సృష్టించేందుకు ఇది మరో ముందడుగులాంటిదన్నారు. స్పేస్ఎక్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షాన్ని చేరుకోవడానికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గిందన్నారు.
కానీ, భారత్ రాకెట్ ధర వ్యవయాన్ని అదేవిధంగా తగ్గించిందన్నారు. వ్యయాన్ని తగ్గించడం వల్ల చిన్న ఉపగ్రహాల ప్రయోగాన్ని ప్రోత్సహించవచ్చని, అంతరిక్ష రంగంలో కొత్త సంస్థలను ఆకర్షించవచ్చన్నారు. 2040 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలనే లక్ష్యంతో మానవ అంతరిక్ష కార్యకలాపాలను విస్తరించడం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అన్న ఆయన.. ఇందులో గగన్ యాన్ మిషన్ సైతం ఉందన్నారు. చంద్రుడి పైకి వెళ్లి నమూనాలను తీసుకువచ్చేందుకు.. భవిష్యత్ మానవ ప్రయోగాల కోసం అధిక పేలోడ్ సామర్థ్యం కలిగిన రాకెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇస్రో చీఫ్ అన్నారు. అయితే, జీఎస్ ఎల్వీ-ఎంకే3 మన వద్ద ఉన్న అతిపెద్ద రాకెట్ అన్నారు. చంద్రుడిపైకి వెళ్లేంత సామర్థ్యం ఉన్నప్పటికీ తిరిగి రాలేమన్నారు. నమూనాలను తిరిగి తీసుకువచ్చి మళ్లీ చంద్రుడిపైకి మనుషులను పంపి తిరిగి తీసుకువచ్చే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.