బెంగళూరు, మే 18: ప్రణాళిక ప్రకారం పనులన్నీ జరిగితే రెండు నెలల వ్యవధిలోపే చంద్రుడిపైకి మరో అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో యోచిస్తున్నది. కీలక సాంకేతికత సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి అంతరిక్ష నౌకను పంపే ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో జూలై రెండో వారంలో చంద్రయాన్-3కి సిద్ధమవుతున్నదని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు గురువారం ప్రకటించారు. ‘చంద్రుడి శాస్త్ర విజ్ఞానం’ తెలుసుకోవడంలో భాగంగా జాబిల్లి ఉపరితలంపై వదులుగా ఉన్న రాళ్లు, ధూళి, వాయువులు, ద్రవ్యరాశి లాంటి భౌతిక కారణాలను అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
‘చంద్రుడి నుంచి శాస్త్ర విజ్ఞానం’ అనే మరో అంశంలో భాగంగా చంద్రుడి కక్ష్య నుంచి భూమి వెలువరించే కాంతి-విద్యుదయస్కాంత తరంగాలను కూడా ఇస్రో విశ్లేషించనుంది. చంద్రయాన్-3 చంద్రయాన్-2కు కొనసాగింపని, చంద్రుడి క్షక్ష్యలో 100 కి.మీ పరిధి వరకు అంతరిక్ష నౌక చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ అయి తిరగడానికి అనువైన పరిస్థితులను అధ్యయనం చేయడానికి చంద్రయాన్ ప్రాజెక్ట్ చేపట్టామని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. అంతరిక్ష నౌక ద్వారా చంద్రుడిపైకి చేరే ల్యాండర్, రోవర్ అక్కడి భౌగోళిక, భౌతిక పరిస్థితులను అధ్యయనం చేయనున్నాయి. చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యే తీవ్ర ధ్వనులను అంతరిక్ష నౌక తట్టుకోగలదా అనే ప్రాథమిక పరీక్షను ఈ ఏడాది మార్చిలో ఇస్రోలోని ప్రయోగశాలలో చంద్రయాన్-3 విజయవంతంగా పూర్తి చేసింది.