శ్రీహరికోట: అద్భుత విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించనుంది. ఈఏడాది చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించింది. అదే స్ఫూర్తితో మరో ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం ఉదయం పీఎస్ఎల్వీ-సీ58 (PSLV-C58) ప్రయోగానికి సిద్ధమైంది. మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్పోశాట్)ను ఈ వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించి కౌంట్డౌన్ను ఇస్రో ప్రారంభించింది. ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగియనుంది.
ఎక్స్పోశాట్ భారతదేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలుకనుంది. ఎక్స్-రే మూలాలను అన్వేషించడం దీని ఈ శాటిలైట్ ప్రధాన లక్ష్యం. దీని జీవితకాలం ఐదేండ్లు.