హైదరాబాద్: రూ.2వేల నోటును ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక డినామినేషన్(Highest Value Currency) ఉన్న కరెన్సీ ఏంటో తెలుసా? రెండు వేల నోటే పెద్దదా.. లేక అంతకన్నా ఎక్కువ విలువగల నోటును ప్రింట్ చేశారా? అయితే ఆర్బీఐ ప్రకారం కొన్ని విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఆర్బీఐ తన వెబ్సైట్లోని కరెన్సీ మ్యూజియం సెక్షన్లో అత్యధిక డినామినేషన్ నోట్లకు చెందిన విషయాలను పొందుపరిచింది. 1954లో రూ.1000, రూ.5000, రూ.10000 నోట్లను రీఇంట్రడ్యూస్ చేసినట్లు ఉంది. 1946లో చేపట్టిన నోట్ల రద్దు తరహాలోనే.. 1978లో కూడా హై డినామినేషన్ నోట్లను రద్దు చేశారు. అయితే రూ.2000 నోటు కన్నా ముందే.. ఇండియాలో హై డినామినేషన్ విలువ గల నోట్లు చెలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ ప్రకారం 1938లో రూ.10,000 నోట్ను ప్రింట్ చేశారు. ఇండియా ప్రింట్ చేసిన అత్యధిక విలువగల నోట్ ఇదే. అయితే ఆ నోట్ను 1946లో రద్దు చేశారు. కానీ మళ్లీ 1954లో రూ.10,000 నోటును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఇక చివరకు 1978లో ఆ రూ.10,000 నోట్ను డిమానిటైజ్ చేశారు.
ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం.. రూ.5000 నోట్పై గేట్ వే ఆఫ్ ఇండియా ఇమేజ్, రూ.10000 నోట్పై సింహాం, అశోక పిల్లర్ బొమ్మలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది.. స్వతంత్ర భారత్గా మారిన రోజుల్లోనే రిజర్వ్ బ్యాంక్ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ సైట్లో తెలుస్తుంది. అంటే 1947, ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి నుంచి.. రిపబ్లిక్గా మారిన 1950, జనవరి 26వ తేదీ వరకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోట్లే చెలామణి అయ్యాయి.
1953లో తొలిసారి కరెన్సీ నోట్లపై హిందీ భాషను ప్రింట్ చేశారు. తొలుత రుపయ్యా అనే వారు. ఆ తర్వాత దాన్ని రుపియేగా మార్చేశారు.