లక్నో: ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారికి డేటింగ్ యాప్లో ఒక మహిళ పరిచయమైంది. అయితే అతడి ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి దాటవేస్తున్న ఆ అధికారి తన కుమార్తెను మోసగించడంతోపాటు హత్య చేశాడని ఆ మహిళ తండ్రి ఆరోపించాడు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఐఆర్ఎస్ అధికారి (IRS Officer) సౌరభ్ మీనా, బీహెచ్ఈఎల్లో హెచ్ఆర్ అధికారణి శిల్పా గౌతమ్ మధ్య డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.
కాగా, శనివారం మధ్యాహ్నం నోయిడాలోని సౌరభ్ మీనా ఫ్లాట్కు పోలీసులు చేరుకున్నారు. ఒక గదిలోని సీలింగ్కు శిల్పా మృతదేహం వేలాడటాన్ని గమనించారు. ఆమె మరణం గురించి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె శిల్పాను సౌరభ్ మోసం చేశాడని ఆమె తండ్రి ఆరోపించాడు. మూడేళ్ల కిందట డేటింగ్ యాప్ ద్వారా వారికి పరిచయం ఏర్పడిందని తెలిపాడు. శిల్పాను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సౌరభ్ ఆ తర్వాత ఆమెను మోసగించి భౌతికంగా వేధించడంతోపాటు చివరకు హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు శిల్పా తండ్రి ఆరోపణలను సౌరభ్ ఖండించాడు. మూడు నెలల కిందటే డేటింగ్ యాప్ ద్వారా తమకు పరిచయం ఏర్పడిందని పోలీసులకు తెలిపాడు. తన ఫ్లాట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. అయితే సౌరభ్ను అరెస్ట్ చేసిన పోలీసులు శిల్పా మరణంపై దర్యాప్తు చేస్తున్నారు.