న్యూఢిల్లీ: ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రయాణికుల కోసం మైక్రోవేవ్, ఇండక్షన్ ప్లేట్లకు మారి రెడీ టు ఈట్ ఆహార పదార్థాల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని రైల్వే స్టేషన్లలోని తన క్యాటరింగ్ యూనిట్లను ఐఆర్సీటీసీ ఆదేశించింది. నిరంతరాయంగా క్యాటరింగ్ సేవలు అందజేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు మారాలని ఫుడ్ ప్లాజాలు, జన్ ఆహార్ల నిర్వాహకులకు మంగళవారం జారీచేసిన ఓ నోటీసులో సూచించింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడవచ్చన్న వార్తల నేపథ్యంలో ఐఆర్సీటీసీ నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎల్పీజీ సరఫరాలో కొరత ఏర్పడితే దాన్ని అధిగమించేందుకు మైక్రోవేవ్లు, ఇండక్షన్ స్టవ్లు వంటి ప్రత్యామ్నాయ వంట పద్ధతులకు మారలని సంస్థ సూచించింది. ప్రయాణికుల డిమాండుకు అనుగుణంగా వండిన ఆహార పదార్థాలతోపాటు ప్రమాణాలతో కూడిన ప్యాకేజ్డ్ ఫుడ్, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను సమృద్ధిగా నిల్వ చేసుకోవాలని ఆదేశించింది.