తిరువనంతపురం: కేరళ యూనివర్సిటీల్లో నియామకాలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ ఏఎం ఖాన్ తప్పుపట్టారు. తనను రాజకీయ నియామకాల కోసం వాడుకోవడానికి బదులు.. సీఎం తనకు తానే ఛాన్సెలర్ కావచ్చని గవర్నర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఛాన్సెలర్ అయ్యానని, కానీ, ముఖ్యమంత్రి మాత్రం తన రాజకీయ ఎజెండా ప్రకారం నియామకాలు చేయాలని తనను కోరుతున్నారని గవర్నర్ ఖాన్ విమర్శించారు.
ఇలాంటి నియామకాలు ఇకపై చేయబోనని, కావాలంటే నీకు నువ్వే ఛాన్సెలర్ అవ్వు అని తాను సీఎంకు చెప్పానని ఏఎం ఖాన్ తెలిపారు. ఇదే విషయమై అంతకుముందు సీఎంకు లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల చట్టాన్ని సవరించి మీకు మీరు వ్యక్తిగతంగా ఛాన్సెలర్ పదవి తీసుకోవాలని సలహా ఇస్తున్నా. దానివల్ల మీరు మీ రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం గవర్నర్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు అని ఆ లేఖలో పేర్కొన్నారు.