ఆగ్రా, జూన్ 26: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్పై బీజేపీ ఎంపీ ఒకరు కోపంతో రెచ్చిపోయి చిందులు వేశారు. ‘నీవు ఏ పార్టీకి చెందిన కార్యకర్తవు? నీ సంగతి తేలుస్తా’ అంటూ బహిరంగంగా బెదిరించారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
రాజ్నాథ్ సింగ్ ఆగ్రాలోని కగరోల్కు రాగా, దానిలో పాల్గొనేందుకు ఫతేపూర్ సిక్రీ బీజేపీ ఎంపీ రాజ్కుమార్ చహర్ కూడా వచ్చారు. కారు పార్కింగ్నకు సంబంధించి ఎంపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇన్స్పెక్టర్ను ఆయన తీవ్రంగా బెదిరించారు. దీనిని వివాదం చేయవద్దంటూ సీఐ అతనికి చేతులు జోడించి అడుగుతుండటం కన్పించింది. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గని ఎంపీ నీది ఏ పార్టీ, నీ సంగతి తర్వాత చూస్తా.. అంటూ రెచ్చిపోతూ బెదిరించారు.