అహ్మదాబాద్: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. మంటల్లో కాలి ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. (Charred bodies) మరో 27 మంది కార్మికులకు కాలిన గాయాలయ్యాయి. గుజరాత్లోని సూరత్లో ఈ సంఘటన జరిగింది. ఏథర్ ఇండస్ట్రీస్లో బుధవారం తెల్లవారుజామున కెమికల్ స్టోరేజీ ట్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు అదృశ్యమయ్యారు.
కాగా, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత అదృశ్యమైన కార్మికుల కోసం గురువారం వెతికారు. ఈ నేపథ్యంలో ఏడుగురు కార్మికులు కాలి బూడిదిగా మారినట్లు గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపారు. గుజరాత్లోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తల్లో ఒకరు, 1.3 మిలియన్ డాలర్ల సంపద ఉన్న అశ్విన్ దేశాయ్కు చెందిన కంపెనీగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.