న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దక్షిణ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం శనివారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇనుప శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని రక్షించినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్టేడియంలో ఒక వివాహ వేడుక కోసం నిర్మిస్తున్న భారీ మండపం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఇనుప పరికరాల కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తొలుత ఇద్దరిని, తర్వాత తొమ్మిది మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చినట్టు ఫైర్ అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని భావిస్తున్నారు.