Chicken | చండీఘర్ : పందెంలో భాగంగా గాయపడ్డ కోడికి పోలీసులు భద్రత కల్పించారు. ఈ ఘటన పంజాబ్లోని భటిండాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ భటిండాలోని బల్లౌనా గ్రామంలో కోడి పందాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది భాగస్వాములయ్యారు. అయితే కోడి పందాలపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో బల్లౌనా గ్రామానికి పోలీసులు చేరుకున్నారు.
పోలీసులను గమనించిన కోడి పందాల నిర్వాహకులు, గ్రామస్తులు అక్కడ్నుంచి పారిపోయారు. కేవలం రెండు కోళ్లు, ఒక వ్యక్తి మాత్రమే తమకు చిక్కినట్లు పోలీసులు తెలిపారు. అయితే రెండు కోళ్లలో ఒకటి తీవ్రంగా గాయపడింది. దీంతో దాన్ని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అది చనిపోయినట్లు నిర్ధారించారు. మరో కోడికి గాయాలు కాగా చికిత్స అందించారు. ఆహారం కూడా పోలీసులే సమకూర్చారు. ప్రస్తుతం ఆ కోడి పోలీసుల భద్రతలో ఉంది.
ఈ ఘటనలో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కోడి పందాల నిర్వహణకు సంబంధించిన 11 ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో సాక్ష్యం గాయపడ్డ కోడినే అని పోలీసులు తేల్చారు. ఈ కోడిని కోర్టులో ప్రవేశపెట్టి, నిందితులకు శిక్ష విధిస్తామన్నారు.