శ్రీనగర్: ఎయిర్పోర్ట్లో పార్కింగ్ సమయంలో ఇండిగో విమానం ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ పోల్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే అందులోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. (IndiGo Plane Hits Pole) శుక్రవారం ఇండిగోకు చెందిన 6ఈ 225 ఫ్లైట్ నవీ ముంబై నుంచి శ్రీనగర్ చేరుకున్నది. ఉదయం 9 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయంలో అది ల్యాండ్ అయ్యింది. అయితే ఎయిర్పోర్ట్లోని 6వ నంబర్ బే వద్ద పార్కింగ్ సమయంలో ఆ విమానం ప్రమాదానికి గురైంది. అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ పోల్ ఒక పక్కకు ఒంగిపోయింది. ఈ సంఘటనలో ఇండిగో ఫ్లైట్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది.
కాగా, ఈ ప్రమాదాన్ని ఇండిగో సంస్థ ధృవీకరించింది. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. విమానంలోని మాన్యువల్ మెట్ల ద్వారా ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కిందకు దించినట్లు వివరించింది.
మరోవైపు నిర్దేశిత నిబంధనల ప్రకారం ఈ సంఘటన గురించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ఆ అధికారులతో కలిసి దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. ‘అవసరమైన నిర్వహణ పనుల కోసం ఆ విమానాన్ని నిలిపివేశాం. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాం. వినియోగదారులు, సిబ్బంది భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత’ అని వెల్లడించింది.
అయితే ఈ సంఘటన తర్వాత శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.