చెన్నై: విమానం రద్దైనా లేక ఆలస్యమైనా ‘ప్లాన్ బీ’ని ఎంచుకోవచ్చని తన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ సూచించింది. అయితే కరోనా వల్ల ఈ నెల 9న పూర్తి లాక్డౌన్ విధించిన తమిళనాడులో మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ లాక్డౌన్ వల్ల ప్రజా రవాణాకు ఆటంకం కలుగవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండిగో విమానాల్లో ప్రయాణించే వారికి ఆ సంస్థ పలు సూచనలు చేసింది. ప్రయాణాల కోసం తగినంత సమయం కేటాయించుకోవాలని, ఎయిర్పోర్ట్కు చేరేందుకు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది.
తమిళనాడులో ఈ నెల 9న పూర్తి లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ‘ప్లాన్ బి’ని ఎంచుకోవాలని ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. ‘మీ ఫ్లైట్ రద్దైనా లేక చివర్లో రీషెడ్యూల్ అయితే, మీరు చింతించాల్సిన అవసరం లేదు. మేము మీ కోసం ‘ప్లాన్ బీ’ని ఉంచాము. ‘ప్లాన్ బీ’తో మీరు మీ ఫ్లైట్ సమయం లేదా తేదీని మార్చుకోవచ్చు. లేదా అదనపు ఖర్చు లేకుండా టికెట్ రద్దు చేసుకుని వాపసును ప్రాసెస్ చేయవచ్చు’ అని తెలిపింది.
మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్లయితే, మీ ఫ్లైట్ టైమింగ్ నిర్ణీత సమయానికి ఒక గంట లేదా అంతకంటే ఎక్కువగా వాయిదా వేసినా లేదా బయలుదేరే షెడ్యూల్ సమయానికి 2 లేదా అంతకంటే ఎక్కువ గంటలు వాయిదా వేసినా, ఇండిగో అందించే ప్లాన్ బి వర్తిస్తుందని వెబ్సైట్లో నోటిఫై చేసింది. అయితే ఒకసారి ప్లాన్ బీని ఎంచుకున్న తర్వాత, ఇండిగో షరతులు, నిబంధనల ప్రకారం ఏదైనా తదుపరి మార్పు లేదా రద్దు కోసం ఆ మేరకు ఛార్జ్ చేయవచ్చని తెలిపింది.