న్యూఢిల్లీ, ఆగస్టు 30: కరోనా థర్డ్వేవ్ సంకేతాలు కొన్ని రాష్ర్టాల్లో కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ సాంక్రమిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా తెలిపారు. మూడో వేవ్ రావడానికి ఇంకా 2-3 నెలల సమయం ఉందని భావించరాదని చెప్పారు. పండుగల సమయంలో జాగ్రత్తలు పాటించకపోయినా, ప్రజలు గుమిగూడినా అవి ‘సూపర్ స్ప్రెడర్లు’గా మారుతాయని హెచ్చరించారు. మిజోరం, కేరళలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటాన్ని ఆయన గుర్తుచేశారు.
అక్టోబర్-నవంబర్ మధ్య గరిష్ఠస్థాయికి..
ఇప్పుడున్నవాటి కంటే వేగంగా వ్యాపించగల మ్యుటెంట్ సెప్టెంబర్ చివరినాటికి ప్రబలితే, దేశంలో అక్టోబర్-నవంబర్ మధ్య థర్డ్వేవ్ గరిష్ఠస్థాయికి చేరవచ్చని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్ తెలిపారు. ఒకవేళ కొత్త మ్యుటెంట్ ఏదీ రాని పక్షంలో ప్రస్తుత పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని చెప్పారు. మూడో వేవ్ తీవ్రత సెకండ్ వేవ్లా ఉండదని, గరిష్ఠంగా రోజుకు లక్ష కేసులు నమోదుకావొచ్చని అంచనావేశారు.
మరో డేంజరస్ వేరియంట్ సీ.1.2
కరోనా వైరస్లో మరో కొత్త, ప్రమాదకరమైన వేరియంట్ సీ.1.2 బయటపడింది. దీనిని దక్షిణాఫ్రికాలో తొలిసారి మే నెలలో గుర్తించారు. ఇది ఇంతకుముందున్న అన్ని వేరియంట్ల కన్నా వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. టీకా కల్పించే రక్షణ నుంచి కూడా తప్పించుకొని దాడి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. ఆగస్టు 13 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చైనా, మారిషస్, ఇంగ్లండ్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీ.1.2 వేరియంట్ను గుర్తించారు. దక్షిణాఫ్రికాలో మొదటివేవ్కు కారణం అయిన సీ.1 నుంచి ఇది ఉత్పరివర్తనం చెందింది. దక్షిణాఫ్రికాలో మే నెలలో నమోదైన కేసుల్లో ఈ వేరియంట్ కేసులు 0.2% ఉండగా, జూలై నాటికి ఇది 2శాతానికి చేరింది. బీటా, డెల్టా వేరియంట్లు కూడా ఇదే వేగంతో వ్యాపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సీ.1.2 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్పై ప్రభావం చూపవచ్చని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్త, వైరాలజిస్టు ఉపాసనా రాయ్ అన్నారు.