బెంగళూరు : భారత అంతరిక్ష రంగంలో నాయకత్వ మార్పు చోటు చేసుకుంటున్నది. ఇస్రోలో ఉద్యోగుల సంఖ్య ఆరేండ్లలో కనిష్ఠంగా 14,637కి పడిపోగా, ప్రైవేట్లో 440 స్టార్టప్లు రూ.4.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షలకు పైగా అత్యుత్తమ నైపుణ్య ఉద్యోగాలను సృష్టించనున్నాయి. 2021-22లో భారత రోదసి రంగంలో రూ.949.63 కోట్లుగా ఉన్న ప్రైవేట్ పెట్టుబడులు ఈ సంవత్సరం మార్చి నాటికి రూ.1766.97 కోట్లకు చేరుకొన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి రూ.85,041.4 కోట్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చే దశాబ్దం నాటికి రూ.4,25,207 కోట్లకు చేరుకొనే అవకాశం ఉన్నది. విస్తృతమైన ఏరోస్పేస్, డ్రోన్, అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ 2033 నాటికి అయిదు రెట్లు పెరిగి రూ.4.16 లక్షల కోట్లకు చేరుకొని ఇంజినీర్లు, పరిశోధకులు, డాటా శాస్త్రవేత్తలు, ఇతర ప్రొఫెషనల్స్కు 2 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.
ప్రైవేట్ రంగంలో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ సొంత రోదసి సంస్థలో ఆరేండ్ల కనిష్ఠానికి ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. ఉద్యోగ ఖాళీలు కూడా రెండింతలై 5,632కు చేరుకొన్నాయి. 2023లో భారత రోదసి విధానంలో ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచింది. ఇప్పుడు అవి ప్రయోగ నౌకలను అభివృద్ధి చేస్తూ, ఉపగ్రహాలను నిర్మిస్తూ అన్ని వ్యాపార సేవల్లో విస్తరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వాటికి వ్యవస్థాగత సామర్థ్యాలను బదిలీ చేస్తున్నది. అయితే నాసా వంటి విదేశీ సంస్థలకు తరలి వెళ్తున్న మేధో వలసను అడ్డుకోవడంలో ప్రైవేట్ రంగ విస్తరణ తోడ్పడవచ్చు. ఇది దేశ రోదసి లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడవచ్చు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కార్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కార్యకలాపాలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేయడంపై ఇస్రో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. సంస్థ ప్రైవేటీకరణపై రాతపూర్వక స్పష్టత ఇవ్వాలని 9 ఉద్యోగ సంఘాలు ఇస్రో చైర్మన్కు లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ స్పందిస్తూ.. సంస్థను ప్రైవేటీకరించబోమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగినా, ఇస్రోకు వచ్చిన ముప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు.