హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి విక్రమ్-ఎస్ సిరీస్ రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోనున్నది. టెలిమెట్రీ, ట్రాకింగ్, ఇన్ ఏరియల్ మెజర్మెంట్, జీపీఎస్, ఆన్ బోర్డ్ కెమెరా, డాటా అక్విజిషన్ అండ్ పవర్ సిస్టం వంటి అంశాలను ఈ రాకెట్ అధ్యయనం చేయనున్నది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఈ రాకెట్ను రూపొందించింది. ఇస్రో, ఇన్స్పేస్ సహకారంతో రెండేండ్లలోపే దీన్ని సిద్ధం చేసింది. ప్రారంభ్ పేరుతో విక్రమ్-ఎస్ రాకెట్లను వరుసగా పంపేందుకు స్కైరూట్ ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నది. తొలి రాకెట్ ద్వారా స్పేస్ కిడ్స్ ఇండియా (తమిళనాడు), బజూమ్క్యూ (ఆర్మేనియా), ఎన్-స్పేస్ టెక్ ఇండియా(ఆంధ్రప్రదేశ్)కు చెందిన మూడు పేలోడ్స్ను నింగిలోకి పంపిస్తున్నారు.
ద్రవ్యరాశి – 545 కిలోలు
పొడవు – 6 మీటర్లు
పేలోడ్ సామర్థ్యం – 83 కిలోలు