న్యూఢిల్లీ, మార్చి 16 : గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులందరికీ ఈ-కేవైసీని తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారులందరూ బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్(ఈ-కేవైసీ) తప్పనిసరిగా చేసుకోవాలని మంత్రిత్వశాఖ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నది. వినియోగదారులు చమురు మార్కెటింగ్ కంపెనీకి చెందిన మొబైల్ యాప్ను లేదా ఆధార్ ఫేస్ ఐడీ యాప్ని ఉపయోగించి తమ ఇండ్లలో నుంచే ఈకేవైసీ చేసుకోవచ్చని మంత్రిత్వశాఖ సూచించింది. మరింత సమాచారం కోసం ప్రజలు అధికారిక వెబ్సైట్ను దర్శించవచ్చని లేదా ఎల్పీజీ పంపిణీదారుడిని సంప్రదించవచ్చని తెలిపింది.
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందన్న విషయాన్ని కేంద్రం ఎట్టకేలకు అంగీకరించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఒప్పుకొన్నారు. అయితే దేశంలో ముడి చమురు నిల్వలు తగినంత ఉన్నాయని.. ఎక్కడా గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి మాత్రం లేదని ఆమె తెలిపారు. అన్ని చమురు శుద్ధి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపారు.