న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్ సందర్భంగా ఆన్లైన్ అమ్మకాలు దుమ్మురేపాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య కేవలం నెల రోజుల్లోనే రూ.76,000 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. నిరుడుతో పోల్చితే 25 శాతం పెరగడం గమనార్హం. బెంగళూరుకు చెందిన రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ వివరాల ప్రకారం ద్వితీయ శ్రేణి, ఆపై నగరాల వాటానే మొత్తం అమ్మకాల్లో 57 శాతంగా ఉన్నదని తేలింది. కాగా, ప్రధాన నగరాలేగాక చిన్నచిన్న ఊర్లకూ ఆన్లైన్ వ్యాపారం విస్తరించిందని రెడ్సీర్ పేర్కొన్నది.
ఫ్యాషన్ విభాగంలోనే
ఈ పండుగ అమ్మకాల్లో ఫ్యాషన్ విభాగంలోనే ఎక్కువ వ్యాపారం జరిగినట్టు తాజా నివేదిక ద్వారా స్పష్టమైంది. అయితే అన్బ్రాండెడ్ ఫ్యాషన్ వస్తూత్పత్తుల విక్రయాలే అధికంగా జరిగాయి. ఇక మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ హవా ఎప్పట్లాగే ఈసారీ కొనసాగింది. హోమ్-కిచెన్, గ్రాసరీస్తోపాటు సౌందర్య వ్యక్తిగత సంరక్షణ సాధనాలకూ డిమాండ్ బాగానే ఉన్నట్టు రెడ్సీర్ చెప్పింది. ముఖ్యంగా గత ఏడాదితో చూస్తే గ్రాసరీ అమ్మకాలు రెండు రెట్లు పెరిగాయని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ అసోసియేట్ పార్ట్నర్ సంజయ్ కోఠారి తెలిపారు.