బెంగళూరు: దేశంలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకడం కలకలం రేపుతున్నది. మరోవైపు బెంగళూరులో గుర్తించిన తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు వ్యక్తి నెగిటివ్ రిపోర్ట్తో దుబాయ్ వెళ్లినట్లు కర్ణాటక అధికారులు గుర్తించారు. 66 ఏండ్ల దక్షిణాఫ్రికా జాతీయుడు నవంబర్ 20న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు గురువారం తెలిపారు. అదే రోజున ఎయిర్పోర్ట్లో అతడికి చేసిన కరోనా టెస్ట్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందన్నారు. టీకా రెండు డోసులు తీసుకున్న ఆ వ్యక్తి హోటల్ చేరాడని, అక్కడ కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా తేలిందని చెప్పారు.
దీంతో ప్రభుత్వ వైద్యుడు ఆ హోటల్కు వెళ్లి ఆ వ్యక్తిని పరిశీలించారని, ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఐసొలేషన్లో ఉండాలని సూచించారని అధికారులు తెలిపారు. రిస్క్ దేశాల జాబితా నుంచి అతడు రావడంతో నవంబర్ 22న మరోసారి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపినట్లు చెప్పారు.
కాగా, నవంబర్ 23న ఆ వ్యక్తి మరోసారి ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో నవంబర్ 27న అర్థరాత్రి వేళ హోటల్ను వీడిన ఆయన క్యాబ్లో ఎయిర్పోర్ట్కు చేరుకుని విమానంలో దుబాయ్ వెళ్లాడని, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడని వెల్లడించారు. అయితే అతడికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్లుగా గురువారం అధికారంగా నిర్ధారణ అయ్యిందని వివరించారు.
మరోవైపు ఆ వ్యక్తిని సంప్రదించిన 24 మంది ప్రైమరీ కాంటాక్ట్స్లో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని, వారికి కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని బీబీఎంపీ అధికారులు తెలిపారు. నవంబర్ 22, 23న 240 మంది సెకండరీ కాంటాక్ట్స్ నుంచి నమూనాలు సేకరించి కరోనా టెస్ట్ చేయగా వారికి కూడా నెగిటివ్ వచ్చిందన్నారు.