న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు దేశంలో టీకా పంపిణీ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. ఫ్రంట్ లైన్ వారియర్లతో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ సంవత్సర కాలంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. 2021, జనవరి 16న టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. టీకాపై ఎన్నో అపోహాలు, భయాలు కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించారు. ఎన్నో అనుమానాల మధ్య ప్రారంభమైన ఈ ప్రక్రియ ఎన్నో విజయాలను నమోదు చేసింది.
వ్యాక్సినేషన్ ప్రారంభమై నేటికి సంవత్సరం పూర్తవుతున్న వేళ 156 కోట్ల డోసుల టీకా పంపిణీ మైలురాయిని అధిగమించింది. అందులో 90 కోట్ల మందికి పైగా మొదటి డోసు, 62 కోట్ల మందికి పైగా రెండో డోసు టీకా తీసుకున్నారు. 42 లక్షల మందికి బూస్టర్ డోసును అందించి ప్రపంచంలోనే రికార్డు నెలకొల్పింది.
ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభించగా, మార్చి 1 నుంచి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధుల వారికి వ్యాక్సినేషన్ అందించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబడిన అందరికీ టీకా వేశారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు అందించడం ప్రారంభించారు. ఈ నెల 3 నుంచి 15 -18 ఏండ్ల వయసున్న పిల్లలకు టీకాలు వేస్తున్నారు. 10వ తేదీ నుంచి వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు బూస్టర్ డోస్ను అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ టీకా ప్రక్రియ మహాయజ్ఞంలా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 కోట్ల 2 లక్షలకు పైగా డోసులను పంపిణీ చేశారు. 2 కోట్ల 94 లక్షలకు పైగా మొదటి డోసు పంపిణీ చేయగా, 2 కోట్ల 7 లక్షలకు పైగా రెండో డోసు ఇచ్చారు. ఐదారు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో మొదటి డోసు 100 శాతం పూర్తయింది. బూస్టర్ డోసును లక్షా 21 వేల మందికి పైగా అందించారు. 15 నుంచి 18 ఏండ్ల వయసు మధ్య 18 లక్షల 40 వేల మంది ఉండగా, 8 లక్షల 86 వేల మంది పిల్లలకు టీకాలు వేశారు.