ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి
400 కోట్లతో ఆలయ విస్తరణకు ప్రతిపాదనలు
100కోట్లకుపైగా వీటీడీఏ నిధులతో కొనసాగుతున్న పనులు
తాజాగా బడ్జెట్లో 50కోట్లు కేటాయింపు
ఇక ప్రగతి పనులు వేగవంతం
వేములవాడ/ వేములవాడటౌన్, మార్చి19 : దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రం నాడు వివక్షకు గురైంది. విస్తరణకు నోచుకోక, కనీస వసతుల్లేక భక్తులు పడరాని పాట్లు పడినా పట్టింపు కరువైంది. కానీ, స్వరాష్ట్రంలో ఆలయాలకు పెద్దపీట వేస్తున్న సర్కారు వేములవాడపైనా దృష్టి సారించింది. రాజన్నను దర్శించుకుంటే పదవులు ఊడిపోతాయంటూ గత పాలకులు మోపిన అపవాదును ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సార్లు పర్యటించి తొలగించారు. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయా సందర్భాల్లో చెప్పారు. అయినా విడుతల వారీగా నిధులు ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్బాబు రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ, పనుల వేగవంతానికి అధికారులను ఆదేశిస్తున్నారు. 2016లో వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసిన అనంతరం 400 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 100 కోట్లకుపైగా వీటీడీఏ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆలయ విస్తరణ కోసం దాదాపు 32 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే సమకూర్చారు. మరోవైపు గుడిచెరువు గోదావరి నీటితో కళకళలాడేందుకు శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి లిఫ్ట్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.
మిషన్ భగీరథ నీటితో భక్తుల దాహం తీర్చేందుకు నిధులను కేటాయించి పనులను పూర్తిచేశారు. పట్టణానికి ప్రధాన రహదారులుగా ఉన్న కోరుట్ల, చెక్కపల్లి, జగిత్యాల అనుసంధాన రహదారులను విస్తరించడమే గాకుండా, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో సుందరీకరించారు. అలాగే ఆలయ అభివృద్ధిపై మరిన్ని ప్రతిపాదనలతో నివేదికలు కూడా సిద్ధం చేశారు. 10 కోట్లతో బద్దిపోచమ్మ గుడిని ఎకరం స్థలంలో విస్తరించేందుకు కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే ప్రధాన రహదారిని కూడా విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇవి కాకుండా 92 కోట్లతో గుడిచెరువును కూడా ఆహ్లాదకరంగా మార్చేందుకు సుందరీకరణ పనులు చేస్తున్నారు. వీటితోపాటు పట్టణంలోనూ అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దాదాపు 300 కోట్లకు పైగా నిధులతో రహదారుల విస్తరణ, వంతెన నిర్మాణాలు, ఇతరత్రా పనులు సాగుతున్నాయి. మరోవైపు రెండు బైపాస్ రహదారులను విస్తరింపజేసే పనులు పూర్తి కావడమే గాకుండా, సుందరీకరణ పనులు నడుస్తున్నాయి.
తాజాగా బడ్జెట్లో 50కోట్ల నిధులు
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ కూడా రాజన్న క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు మూడు సార్లు వేములవాడలో పర్యటించారు. ఫిబ్రవరి 1న ఆలయానికి వచ్చారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్షించారు. యాదాద్రి తరహాలో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. తాజా బడ్జెట్లో వీటీడీఏకు 50 కోట్ల నిధులను కేటాయించగా, పనుల వేగవంతానికి అడుగుపడింది. యాదాద్రి పునరుద్ధరణతో ఇన్నాళ్లూ పనులు ఆలస్యమైనట్లు తెలుస్తున్నా, ఇకపై జోరందుకునే అవకాశం కనిపిస్తున్నది. నిధులు కేటాయించడంపై భక్తులతోపాటు వేములవాడ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.