న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత్ మండపంలో గత వారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్(AI Impact Summit) జరిగిన విషయం తెలిసిందే. ఆ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు షర్ట్ విప్పి నిరసన వ్యక్తం చేసిన కేసులో.. ఢిల్లీ పోలీసులు ఇవాళ ఇండియన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాను చిబ్ను అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకోవడానికి ముందు ఆయన్ను సుమారు 20 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 8కి చేరుకున్నది. ఇండియన్ యూత్ కాంగ్రెస్కు చెందిన ఏడుగురిని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుంచి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గుర్నీ జితేంద్ర యాదవ్, రాజ్ గుజ్జార్, అజయ్ కుమార్గా గుర్తించారు. ఐవైసీ యూపీ జనరల్ సెక్రటరీ రితిక్ అలియాస్ మోంటీ శుక్లాను లలిత్పుర్లో అదుపులోకి తీసుకున్నారు.
భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. సెక్షన్ 196, 197 కింద కేసులు జోడించారు. ఈ కేసుల్లో మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉన్నది. నేరపూరిత కుట్ర, ప్రజా విధులను అడ్డుకోవడం లాంటి కేసులను ఇప్పటికే ఎఫ్ఐఆర్లో జోడించారు. గత శుక్రవారం సుమారు 10 మందికిపైగా ఐవైసీ కార్యకర్తలు.. ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరుగుతున్న భారత మండపంలోని హాల్ నెంబర్ 5లోకి చొరబడి అక్కడ ఉన్న స్టేజ్పై షర్ట్లు తీసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ప్రింట్ చేసిన టీషర్ట్లను ధరించి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి ప్రవేశించారు. వేదిక వద్దకు వచ్చేందుకు నిరసనకారులు ఆన్లైన్ ద్వారా క్యూఆర్ కోడ్లను రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నిరసన వెనుక ఉన్న నేరపూరిత కుట్ర, ఆర్థిక పరిస్థితులను దర్యాప్తు చేయనున్నారు.