న్యూఢిల్లీ: 75 ఏళ్ల స్వతంత్ర సంబరాల్లో భాగంగా భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక చరిత్ర సృష్టించింది. అమెరికా పశ్చిమ తీరానికి భారత యుద్ధ నౌక తొలిసారి చేరుకుంది. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ సాత్పురా, కాలిఫోర్నియా శాన్ డియాగోలోని అమెరికా నేవల్ బేస్కు శనివారం చేరుకుంది. సోమవారం ఉదయం ఇరు దేశాల నేవీ, ఇతర అధికారుల సమక్షంలో ఆ యుద్ధ నౌకపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ రన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా
ఐఎన్ఎస్ సాత్పురా 75 రౌండ్లు తిరుగుతూ విన్యాసాలు చేస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకమైన 75 మంది ప్రముఖులను గుర్తు చేసుకుంటూ ప్రతి రౌండ్ను వారికి అంకితమిస్తుంది.
కాగా, 75 ఏళ్ల స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల పేరుతో భారత నౌకాదళం గత ఏడాదిగా దేశ, విదేశాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది. విశాఖపట్నంలోని తూర్పు నౌకా దళం ఫ్రంట్లైన్ యూనిట్లో కీలకమైన శివాలిక్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ సాత్పురా స్మారక పర్యటనలు చేపట్టింది. గత ఏడాదిగా 75 దేశీయ ఓడరేవులను సందర్శించింది. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, సెయిల్ షిప్ ఎక్స్పిడిషన్, లోకాయన్ 2022, ముంబైలో స్మారక జెండా ప్రదర్శనతోపాటు దేశంలోని అన్ని తీరప్రాంత జిల్లాల్లో కమ్యూనిటీ ఔట్ రీచ్ కార్యక్రమాల్లో ఇది పాల్గొంది.
అలాగే ఐఎన్ఎస్ సాత్పురా ఆరు ఖండాలు, మూడు మహా సముద్రాలు, ఆరు వేర్వేరు టైమ్ జోన్లలో స్మారక పర్యటనలు చేపట్టింది. చివరకు అమెరికా పశ్చిమ తీరానికి తొలిసారి చేరుకున్న భారత యుద్ధ నౌకగా చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ వెల్లడించింది.