Indian tourist : నేపాల్ (Nepal) లో జెన్-జడ్ నిరసనలు (Gen Z protests) హింసకు దారితీశాయి. నిరసనకారులు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నిప్పటించారు. ప్రధాని, మాజీ ప్రధానులు, మంత్రుల ఇళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఆ ఇళ్లలో దొరికిన వారిపై దాడులకు పాల్పడ్డారు. దాంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. పొఖారా ప్రాంతంలోని ఓ హోటల్పై కూడా నిరసనకారులు దాడి చేశారు. దాంతో ఆ హోటల్లో బస చేస్తున్న భారత పర్యాటకురాలు (Indian Tourist) ఉపాసన గిల్ (Upasana Gill) సాయం కోసం అర్థించారు. భారత ప్రభుత్వం తనకు సాయం చేయాలని ఓ వీడియోలో మొరపెట్టుకున్నారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘నా పేరు ఉపాసన గిల్. వాలీబాల్ లీగ్ కోసం నేపాల్కు వచ్చాను. నిరసనలతో పొఖారా ప్రాంతంలో ఉన్న హోటల్లో చిక్కుకుపోయాను. తొలుత నేను బస చేసిన హోటల్కు నిప్పంటించారు. నా వస్తువులన్నీ అందులోనే ఉండిపోయాయి. దాడి సమయంలో నేను స్పాలో ఉన్నాను. కొందరు నిరసనకారులు పెద్దపెద్ద కర్రలతో నా వెంటపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు. రోడ్డుపై ఎక్కడ చూసినా మంటలే కనిపిస్తున్నాయి. వారు పర్యాటకులను కూడా వదలడం లేదు. ఎలాంటి ఆలోచన లేకుండా ప్రతిదీ తగలబెడుతున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. నాతోపాటు చాలామంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు’ అని గిల్ ఆ వీడియోలో ఆవేదనచెందారు.
ఇదిలావుంటే.. ఇప్పటికే నేపాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అక్కడి రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నంబర్లను వెల్లడించింది. అలాగే పరిస్థితులు చక్కబడేవరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఉన్నచోటే ఉండాలని, వీధుల్లోకి రావొద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. కాగా నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని సొనౌలీ ప్రాంతం మీదుగా భారతీయ పర్యాటకులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు.