న్యూఢిల్లీ : టోఫెల్ స్కోరుతో కూడా ఇకపై కెనడాలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ద్వారా టోఫెల్ స్కోరుతో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ వర్గాలు తెలిపాయి. ఐఈఎల్టీఎస్ రాసిన వారికి మాత్రమే కెనడాలో చదివేందుకు కెనడా ఇమిగ్రేషన్, శరణార్థి, సిటిజెన్షిప్ (ఐఆర్సీసీ) అనుమతి ఇస్తున్నది.
టోఫెల్ రాసిన భారత విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. తాజా నిర్ణయంతో లక్షలాది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్, వర్కింగ్స్కిల్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ తెలిపారు. కెనడాలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే చదువుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.