న్యూఢిల్లీ/ ఒట్టావా: కారు డ్రైవ్ చేస్తున్న భారత విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ఆ కారులో కుప్పకూలి మరణించాడు. కెనడాలోని సౌత్ వాంకోవర్లో ఈ సంఘటన జరిగింది. (Indian Student Shot Dead) ఏప్రిల్ 12న రాత్రి వేళ 24 ఏళ్ల చిరాగ్ ఆంటిల్ తన ఆడీ కారులో బయటకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈస్ట్ 55వ అవెన్యూ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పుల గాయాలతో కారులో మరణించిన చిరాగ్ను గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, హర్యానాలోని సోనిపట్లో ఉంటున్న చిరాగ్ కుటుంబానికి అతడి హత్య గురించి తెలియడంతో వారు తల్లడిల్లిపోయారు. మృతదేహాన్ని భారత్కు రప్పించాని ప్రభుత్వాన్ని కోరారు. 2022లో ఎంబీఏ చదివేందుకు చిరాగ్ స్టడీ వీసాపై కెనడా వెళ్లినట్లు సోదరుడు తెలిపారు. వాంకోవర్లో డిగ్రీ పొందిన అతడు అక్కడ జాబ్ చేస్తున్నాడని వెల్లడించారు. హత్యకు గురైన రోజున కూడా చిరాగ్తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు.