IISC Bangalore | బెంగళూరు, మార్చి 28: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కచ్చితం కానున్నది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు అద్భుత ఆవిష్కరణ చేశారు. కార్బన్ డయాక్సైడ్ను వినియోగించి కొత్త పదార్థాన్ని అభివృద్ధి చేశారు. నిర్మాణ వ్యర్థాలు, మట్టిలోకి ప్రత్యేక పద్ధతుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ను జొప్పించి నిర్మాణాల్లో వాడేలా తయారు చేశారు.
ఈ ప్రక్రియతో కాల్షియం కార్బోనేట్ స్పటికాలు తయారవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి ఇసుక, సిమెంట్ కన్నా 20-22 శాతం అధిక మన్నిక, అధిక దృఢత్వాన్ని కలిగి ఉంటాయని వెల్లడించారు. ‘ప్రస్తుతం ఇసుక కొరత, కార్బన్ డయాక్సైడ్ వ్యాప్తి పర్యావరణానికి ఇబ్బందిగా మారాయి. దీన్ని అధిగమించేందుకు మేం కార్బన్ డయాక్సైడ్ను మట్టి, నిర్మాణ వ్యర్థాలతో కలిపి కొత్త పదార్థాన్ని రూపొందించాం’ అని ఐఐఎస్కు చెందిన సెంటర్ ఫర్ సస్టయినబుల్ టెక్నాలజీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌరదీప్ గుప్తా తెలిపారు. తాము అభివృద్ధి చేసిన ఈ పదార్థం నిర్మాణాల్లో 30 శాతం సిమెంట్ వాడకాన్ని, 50 శాతం ఇసుక వాడకాన్ని తగ్గిస్తుందని వివరించారు. మరింత పరిశోధనలు సాగిస్తున్నామని, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.