Indian Railway | దివ్యాంగుల ఊరటనిచ్చేలా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. దాంతో రైలులో దివ్యాంగుల ప్రయాణం మరింత సులభతరం కానున్నది. ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన వసతిని నిర్ధారించేందుకు దివ్యాంగులతో పాటు కుటుంబీకులకు మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని ప్రతి బోగిలో లోయర్ బెర్తులను కేటాయించింది. స్లీపర్ క్లాస్లో నాలుగు బెర్త్లు (రెండు లోయర్, రెండు మిడిల్), థర్డ్ ఏసీలో రెండు బెర్త్లు (ఒకటి లోయర్, ఒకటి మిడిల్), థర్డ్ ఈ క్లాస్లో రెండు (ఒకటి లోయర్, మరొకటి మిడిల్) బెర్త్లు దివ్యాంగులకు రిజర్వ్ చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటరిగా ప్రయాణించే లేదంటే చిన్న పిల్లలతో ప్రయాణించే వృద్ధులు, మహిళలకు ఈ సౌకర్యాన్ని ఇప్పటికే రైల్వే శాఖ కల్పించింది. గరీబ్రథ్లో రెండు లోయర్, రెండు అప్పర్ బెర్తులు దివ్యాంగులకు కేటాయించారు. అదే సమయంలో చైర్కార్ రైళ్లలోనూ రెండు సీట్లు వికలాంగులకు కేటాయించనున్నారు. ఈ సదుపాయం కోసం పూర్తి చార్జీలు చెల్లించాల్సి రానుంది. నాలుగు కేటగిరీల్లో రైల్వే రాయితీని ఇస్తుంది. ఆర్థోపెడికల్ దివ్యాంగులు, మెంటల్లీ రిటార్డెడ్ వ్యక్తులు తోడు లేకుండా ప్రయాణం చేయలేరని, అంధులు, చెవిటి-మూగ వ్యక్తులు ఒంటరిగైనా.. సహాయకుడితో కలిసి ప్రయాణం చేయవచ్చని రైల్వేశాఖ వివరించింది.