Indian Railway | భారతీయ రైల్వేలో కోచ్ల ఉత్పత్తి భారీగా పడిపోయింది. నిర్ణీత గడువులోగా ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడంలో మేజర్ ఫ్యాక్టరీలన్నీ విఫలమయ్యాయని రైల్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం ఉక్రెయిన్ యుద్ధమని చెప్పింది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా ఉత్పత్తికి విఘాతం కలిగిందని తెలిపింది. రైల్వే ఫ్యాక్టరీలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో లోకల్ రైళ్ల కోసం 730 కోచ్లు తయారీ లక్ష్యం కాగా.. ఇందులో 53 కోచ్లను మాత్రమే సిద్ధం చేశాయని రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఐసీఎఫ్ చెన్నైలో 20 శాతం, ఆర్సీఎఫ్-కపుర్తలాలో 10 శాతం, ఎంసీఎఫ్ రాయ్ బరేలీలో 56 శాతం పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా.. ప్రొపల్షన్ సిస్టమ్స్, ట్రాక్షన్ మోటార్లు, లోకోమోటివ్ వీల్స్ సరఫరా సరిగా లేకపోవడంతో ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయినట్లు రైల్వే పేర్కొంది. రైల్వే వీల్ ఫ్యాక్టరీ ద్వారా వీల్సెట్ల ఉత్పత్తి దామాషా లక్ష్యం కంటే 21.96 శాతం తక్కువగా ఉందని, రైల్ వీల్ ప్లాంట్, బేలా లక్ష్యం కంటే 64.4 శాతం తక్కువగా ఉందని రైల్వే నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు లోకోమోటివ్ల ఉత్పత్తి లక్ష్యం కంటే 28 శాతం తక్కువగా ఉందని, జూన్ వరకు 100 రోజుల్లో 40 ఇంజిన్లు తక్కువగా తయారయ్యాయని నివేదిక వెల్లడించింది.