న్యూఢిల్లీ, మే 26: సాధారణంగా మొబైల్ ఫోన్లలో చార్జింగ్ 100 శాతం ఎక్కడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ల్యాప్టాప్లలో అయితే గంటకు పైనే అవసరం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదారు గంటలు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ఇంత సమయం లేనప్పుడు వినియోగదారులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.
ఈ నేపథ్యంలోనే కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్కు 0 శాతం నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు.
ఈ కొత్త సాంకేతికత ద్వారా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని అంకుర్ తెలిపారు. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్పారు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు చార్జింగ్ సమస్యే ప్రధాన అడ్డంకిగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సాంకేతికత ఈ సమస్యకు పరిష్కారం చూపనుంది.