న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని భారత ఆర్మీ అధ్యయనం చేస్తున్నది. ఈ వార్ నుంచి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవడంపై దృష్టిసారించింది. జాతీయ భద్రతా ప్రణాళికదారులు ఈ మేరకు భారత ఆర్మీ ప్రధాన కార్యాలయానికి సూచించారు. 50 రోజులకు చేరిన ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని స్టడీ చేయాలని, వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలని కోరారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రణాళికల ప్రకారం ఉక్రెయిన్పై ఆ దేశం దాడి చేస్తున్నదని 15 కార్ప్స్ మాజీ కమాండర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహా అంచనా వేశారు. అయితే రష్యన్ సైన్యం నైతికత, దాని లాజిస్టికల్ సమస్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. యుద్ధంలో సీనియర్ కమాండర్లను రష్యా సైన్యం కోల్పోతున్నదని దీంతో కమాండ్ అండ్ కంట్రోల్ సమస్యలు ఉన్నట్లుగా తెలుస్తున్నదని అన్నారు. అయితే పుతిన్ సైనిక లక్ష్యాలకు అనుగుణంగా, ఎలాంటి కనికారం లేకుండా ఈ దాడి కొనసాగుతున్నదని భారత ఆర్మీలో అదనపు డీజీఎంవో పని చేసిన జనరల్ సాహు తెలిపారు. అలాగే రష్యా దాడి బలంగా కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు రష్యా దాడిలో చాలా వ్యూహాత్మక సమస్యలున్నాయని, ఆ దేశ సైన్యం సామర్థ్యం, నిబద్ధతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని భారత ఆర్మీ మాజీ చీఫ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వీడియోల ద్వారా ఇది తెలుస్తున్నదని చెప్పారు. ఉక్రెయిన్ వద్ద జావెలిన్, టర్కిష్ బైరక్టర్ టీబీ2 క్షిపణి ఫైరింగ్ డ్రోన్ల వంటి అత్యుత్తమ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో వాయు లేదా పదాతిదళ కవర్ లేకుండా ఒకే నిర్మాణ తీరులో రష్యా యుద్ధ ట్యాంకులు ఎలా ముందుకెళ్తాయని ఆయన ప్రశ్నించారు. రష్యా చాలా యుద్ధ ట్యాంకులను, సైనికులను కోల్పోవడంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు. అలాగే భుజంపై నుంచి క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉక్రెయిన్ ఆర్మీ వద్ద ఉందన్న ఆయన, ఆ దేశ గగనతలంపై రష్యా వైమానిక ఆధిపత్యంపై అనుమానాలున్నాయని అన్నారు. అయితే రాత్రిపూట పోరాడే సామర్థ్యం రష్యా వైమానిక దళానికి ఉందన్నారు.
కాగా, ఉక్రెయిన్పై దాడి ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడు దౌత్యపరమైన లక్ష్యాల్లో రెండింటిని సాధించగలిగారని భారత ఆర్మీ మాజీ కమాండర్ అంచనా వేశారు. నాటోలో ఉక్రెయిన్ చేరకపోవడం, దీని కోసం అమెరికా నుంచి హమీ పొందడం వంటి లక్ష్యాలు ఉన్నాయన్నారు. అయితే దీర్ఘకాలంలో మాస్కోకు యుద్ధ వ్యయం చాలా ఎక్కువగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.