న్యూఢిల్లీ, ఆగస్టు 12: భారతీయ రైల్వే నుంచి రూ.20 కోసం ఓ లాయర్ చేసిన 22 ఏండ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఏడాదికి 12% వడ్డీతో పాటు రూ.20 రీఫండ్ ఇవ్వాలని, అదేవిధంగా రూ.15 వేల పరిహారం అందించాలని రైల్వే అధికారులను కోర్టు తాజాగా ఆదేశించింది. న్యాయం కోసం తాను పడిన తపన చివరకు ఫలించిందని ఉత్తరప్రదేశ్కు చెందిన తుంగనాథ్ చతుర్వేది ఆనందం వ్యక్తం చేశారు.
1999లో తుంగనాథ్ మథుర నుంచి మొరాదబాద్కు రెండు టిక్కెట్లు కొన్నాడు. అయితే అధికారులు అందుకు రూ.70 బదులు రూ.90 చార్జ్ చేశారు. రసీదు కూడా ఇచ్చారు. అధికంగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఎన్నిసార్లు అభ్యర్థించినా.. రైల్వే అధికారులు తిరస్కరించారు. దీనిపై తుంగనాథ్ మథురలోని వినియోగదారుల హక్కుల కోర్టును ఆశ్రయించాడు. రూ.20 కోసం తుంగనాథ్ చేసిన న్యాయపోరాటం ఆసక్తికరమైనది. రెండు దశాబ్దాలపై పైగా జరిగిన ఈ న్యాయపోరాటంలో ఐదుగురు జడ్జిలు.. 120 సార్లు కేసును విచారణ చేపట్టారు. ఫీజులు, ఇతర చెల్లింపు కోసం రూ.20 వేల వరకు ఖర్చు చేశాడు. అయితే తాను చేసిన న్యాయపోరాటం డబ్బు కోసం కాదని, తన హక్కుల కోసమని తుంగనాథ్ చతుర్వేది చెబుతున్నాడు.