Travel Advisory | ఇజ్రాయెల్, లెబనాన్ ఆధారిత హిజ్బుల్లా గ్రూప్స్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందన్న భయాందోళనల మధ్య.. లెబనాన్లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయంల సోమవారం అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్లోని ఫుట్బాల్ మైదానంలో రాకెట్ దాడిలో 12 మంది పిల్లలు, యువకులను హిజ్బుల్లా గ్రూప్ చంపినట్లు ఇజ్రాయెల్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనంతరం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా గ్రూప్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య లెబనాన్లోని భారతీయులు ‘జాగ్రత్తగా’ ఉండాలి అని సూచించింది.
బీరుట్లోని ఎంబసీతో టచ్లో ఉండాలని కోరింది. లెబనాన్కు వెళ్లాలనుకునే, అక్కడి ప్రవాస భారతీయులు ఎంబసీని సంప్రదించాలంటూ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. లెబనాన్ కార్యాలయం ఈ-మెయిల్ ఐడీ cons.beirut@mea.gov.in, అత్యవసర ఫోన్ నంబర్ +96176860128 నెంబర్లో సంప్రదించవచ్చని చెప్పింది. గోలన్ హైట్స్లోని ఫుట్బాల్ మైదానంలో జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వెనుక హిజ్బుల్లా మిలిటెంట్ల హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనికి హిజ్బుల్లా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దాడులకు తాము కారణం కాదని హిజ్బుల్లా పేర్కొంది.