న్యూఢిల్లీ, డిసెంబర్ 7: గూఢచర్యానికి పాల్పడ్డారన్న కేసులో ఖతార్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులతో భారత రాయబారి భేటీ అయ్యారు. ఈ కేసులో వారిని మరణశిక్ష నుంచి బయటపడేసేందుకు భారత్ నుంచి చట్టపరమైన సాయం అందుతున్నదని, భారత రాయబారి డిసెంబర్ 3న వారిని కలుసుకొని మాట్లాడారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మరణశిక్షకు గురైన నేవీ మాజీ అధికారులను కాపాడేందుకు భారత్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. మేమంతా ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. జైల్లో ఉన్న 8 మంది నిందితులను ఖతార్లో భారత రాయబారి కలుసుకొని మాట్లాడారు. రాయబార కార్యాలయం నుంచి వారికి అన్నివిధాలా సహాయం అందుతుంది’అని చెప్పారు. గూఢచర్యం కేసులో అక్టోబర్ 26న ఖతార్ కోర్టు 8 మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించింది.