చండీగఢ్: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన చినూక్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. (Chinook Helicopter Emergency Landing ) పంజాబ్లోని బర్నాలాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం గాలిలో ఎగురుతున్న చినూక్ హెలికాప్టర్ ఒక మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని భారత వైమానిక దళం తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా ముందు జాగ్రత్త కోసం పంజాబ్లోని బర్నాలా సమీపంలో ల్యాండింగ్ చేసినట్లు పేర్కొంది. ఆ హెలికాప్టర్, అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. రికవరీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం కారణాలపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
కాగా, ఇంజిన్లో మంటల కారణంగా చినూక్ హెలికాప్టర్ల వినియోగాన్ని అమెరికా ఆర్మీ 2022లో నిలిపివేసింది. దీంతో ఈ నిర్ణయం గురించి వివరణ ఇవ్వాలని చినూక్ తయారీ సంస్థ బోయింగ్ను భారత్ కోరింది. అయితే భారత వైమానిక దళం నిర్వహిస్తున్న చినూక్ హెలికాప్టర్లలో ఎలాంటి సమస్యలు లేవని
బోయింగ్ ఇండియా చీఫ్ సలీల్ హుప్టే తెలిపారు.