Canada-India Row | కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరుగక ముందే నిందలు వేయడంపై భారత హైకమిషనర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. నిజ్జార్ హత్యకు సంబంధించి చేస్తున్న ఆరోపణలుపై సాక్ష్యాధారాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాన మంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై ప్రశ్నించారు.
ఆయన స్పందిస్తూ విచారణ పూర్తికాక ముందే భారత్ను దోషిగా నిర్ధారించారని.. ఇది చట్టపరంగా సరైందేనా అంటూ ప్రశ్నించారు. భారత్ను విచారణకు సహకరించమని అడిగారని.. అయితే, క్రిమినల్ టర్మినాలజీని ప్రకారం.. ఎవరినైనా విచారణకు సహకరించమని కోరడం.. వారు అప్పటికే దోషి అని అర్థమని తెలిపారు. అయితే, ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కోరామని, ఇస్తే వాటిని పరిశీలిస్తామని చెపపినట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. జూన్ 18న సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య జరగ్గా.. ఇందులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా చేసిన ఆరోపణలను భారత్ కొట్టిపడేసింది. ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, కేవలం ప్రేరేపితమైనని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఒట్టావా భారతీయ దౌత్యవేత్తను కెనడా విడిచి వెళ్లాలని ఆదేశించగా.. భారత్ సైతం ఆ దేశ దౌత్యవేత్తను బహిష్కరించింది.