న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్ల(Predator Drones)పై ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. సుమారు 31 ఎంక్యూ-9 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఇండియా ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చిలోగా ఈ ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అయితే మరికొన్ని వారాల్లో అమెరికా కాంగ్రెస్ నుంచి క్లియరెన్స్ దక్కే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రిడేటర్ డ్రోన్ల ప్రొక్యూర్మెంట్ కోసం ఇరు దేశాలకు చెందిన అధికారులు త్వరలోనే తుది దశ చర్చలు నిర్వహించనున్నారు. సైనిక దళాల నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రిడేటర్ డ్రోన్లను ఖరీదు చేయాలని భారత్ భావిస్తున్నది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద ఆ డ్రోన్లను మోహరించాలని చూస్తున్నది. అయితే డ్రోన్లను ఎంత ఖరీదు పెట్టి కొంటున్నారో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ సుమారు మూడు బిలియన్ల డాలర్ల ఖరీదు పెట్టి ఆ డ్రోన్లను ఖరీదు చేసే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.