Predator drones | ‘మేకిన్ ఇండియా’ అంటూ హోరెత్తిస్తారు. అయితే, కీలకమైన కాంట్రాక్ట్లను మాత్రం విదేశీ కంపెనీలకే ఇస్తారు. నిన్న వందేభారత్ రైళ్ల కాంట్రాక్ట్ రష్యాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రెడేటర్ డ్రోన్స్ కాంట్రాక్ట్ అమెరికాకు ఇస్తున్నారు. అదీ మార్కెట్ ధర కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతూ.
చంద్రయాన్-3 వంటి బృహత్తర మిషన్లో కీలకంగా వ్యవహరించిన దేశీయ రక్షణ సంస్థలు హాల్, డీఆర్డీవో ఈ డ్రోన్లను తయారుచేయలేవా?
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్(నమస్తే తెలంగాణ): అమెరికాకు చెందిన రక్షణరంగ ఉత్పత్తుల సంస్థ జనరల్ అటామిక్స్ (జీఏ)తో భారత్ ఇటీవల ఓ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా గత జూన్లో ఈ డీల్ చర్చల్లో భాగమయ్యారు. ఒప్పందంలో భాగంగా ఎంక్యూ9బీ రకానికి చెందిన 31 ప్రెడేటర్ డ్రోన్లను జీఏ భారత్కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 3.1 బిలియన్ డాలర్లు (రూ. 25,700 కోట్లు) జీఏకు భారత్ చెల్లించనున్నట్టు ఇరువర్గాలు వెల్లడించాయి.
అయితే, అంతర్జాతీయ విపణిలో ఇదే మాడల్ ప్రిడేటర్ ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.150 కోట్లు మాత్రమే. ఇదేమీ పట్టించుకోకుండా డ్రోన్ ఒక్కింటికి రూ. 813 కోట్లు వెచ్చించేందుకు భారత్ సిద్ధమవ్వడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు పూనుకొన్నది. ఇంకా డీల్ పూర్తిస్థాయిలో ఫైనల్ కాలేదని చెప్పుకొచ్చింది. కాగా, జీ20 సమావేశాల కోసం భారత్కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ శుక్రవారం ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ డీల్ విషయమై ఆయన అధ్యక్షుడితో చర్చించినట్టు, ఈ మేరకు రూ. 25,700 కోట్ల మేరకే ప్రెడేటర్ డ్రోన్ డీల్ను ఖరారు చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో డ్రోన్ కొనుగోలులో ఏదో గోల్మాల్ జరుగుతున్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆది నుంచి అనుమానాస్పదమే!
ప్రెడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఆర్మీ విభాగం మొదటి నుంచి అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తున్నది. 31 డ్రోన్లు ప్రస్తుతం తమకు అవసరం లేదని, 18 డ్రోన్లను కొనుగోలు చేయాలని ఆర్మీ విభాగం గత ఏప్రిల్లో కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అమెరికా నుంచి డ్రోన్ల కొనుగోలుపై పునరాలోచించాలని కూడా గతంలో ఓసారి ప్రభుత్వానికి సూచించింది. ఇవన్నీ పట్టించుకోని కేంద్రం.. ఏకపక్షంగానే ముందుకు వెళ్తున్నది. కాగా, డ్రోన్లకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని (నాలెడ్జ్ ట్రాన్స్ఫర్) ఇచ్చేది లేదని జీఏ తెగేసి చెప్పింది. ఇది భారత భద్రతకు ముప్పేనని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. జీఏ కండీషన్లు, కేంద్రం ఏకపక్ష వైఖరితో హాల్, డీఆర్డీవో వంటి దేశీయ రక్షణ రంగ సంస్థలకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం సన్నగిల్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే, దేశీయ సంస్థలను ప్రోత్సహించకుండా కేంద్రం ఆయా కాంట్రాక్ట్లను విదేశీ కంపెనీలకు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. కాగా, ఒక్కో దేశానికి ఒక్కో రేటుకు డ్రోన్లను సరఫరా చేసే ట్రాక్రికార్డు జీఏకు ఉన్నట్టు తెలుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
డీల్ మర్మం ఇదేనా?!
ఎనర్జీ సెక్టార్లో వేళ్లూనుకొన్న జీఏకు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే, జీఏ నుంచి ప్రెడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయాలంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో భారత్పై ఒత్తిడి తీసుకొచ్చారు. 2019లో ‘హౌడీ-మోదీ’ పేరిట మోదీ చేసిన అమెరికా పర్యటనలో ఈ డీల్పై చర్చ కూడా జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డెమొక్రటిక్ పార్టీతో కూడా జీఏకు సత్సంబంధాలు ఉండటంతో ఈ డీల్ ప్రక్రియ మరుగునపడలేదు. కాగా, రాజకీయ ప్రయోజనాలను ఆశించే బీజేపీ సర్కారు అమెరికా ఒత్తిళ్లకు తలొంచిందని, అందకే ఈ డీల్కు ఒప్పుకున్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జీఏ లెక్క ఇది..
ఒక్కో ప్రెడేటర్ డ్రోన్.. ఏ దేశానికి ఎంతంటే?
యూకే- 102కోట్లు
జర్మనీ- 139కోట్లు
అమెరికా- 450కోట్లు
భారత్- 813కోట్లు