న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో 2030 నాటికి 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు మంత్రి సీతారామన్ కొత్త బడ్జెట్లో ప్రకటించారు. ఇంధన పరివర్తన, నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం రూ.35 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
అదేవిధంగా 4 వేల మెగావాట్ అవర్(ఎండబ్ల్యూహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం ప్రభుత్వం మద్దతిస్తుందని, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను నోటిఫై చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న ఏడు ప్రాధాన్యతా అంశాల్లో హరిత వృద్ధి(గ్రీన్ గ్రోత్) కూడా ఉన్నది. రూ.19,700 కోట్లతో ఇటీవల ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హ్రైడోజన్ మిషన్ను మంత్రి సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించారు.