Suryastra : దేశీయంగా తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఇది లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. నిబె లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ తయారు చేసిన ‘సూర్యాస్త్ర’ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది నిర్దిష్ట లక్ష్యాల్ని కచ్చితత్వంతో పూర్తి చేసింది. ఇందులో రెండు వెర్షన్లు ఉంటాయి. ఒకటి 150 కిలోమీటర్ల రేంజ్, రెండోది 300 కిలోమీటర్ల రేంజ్. ఈ రెండింటినీ పరీక్షించగా విజయవంతమయ్యాయి.
150 కిలోమీటర్ల రేంజ్ ‘సూర్యాస్త్ర’ రాకెట్ లక్ష్యానికి 1.5 మీటర్ల దూరంలో, 300 కిలోమీటర్ల రేంజ్ ‘సూర్యాస్త్ర’ రాకెట్ లక్ష్యానికి 2 మీటర్ల దూరంలో తాకింది. మిలిటరీ భాషలో దీన్ని ‘సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ (సీఈపీ)’ అని పిలుస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే పరీక్ష అంత విజయవంతమైనట్లు. దూరంగా ప్రయోగించే క్షిపణులు, రాకెట్లకు ఇది చాలా మంచి లక్ష్యమే. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఈ రాకెట్ వ్యవస్థల్ని భారత ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. దేశీయంగా తయారు చేసిన, గైడెడ్ రాకెట్ వ్యవస్థ ‘సూర్యాస్త్ర’. నిర్దేశిత లక్ష్యాల్ని చేరుకునేందుకు, శత్రువుల కమాండ్ సెంటర్స్, రాడార్ సైట్లు, మిలిటరీ స్థావరాలు, రవాణా సదుపాయాలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటుంది.
ఇవి ఇంతకుముందు ఉన్న సంప్రదాయ ఫిరంగి గుండ్లలాగా కాకుండా ఆధునిక సాంకేతికతను ఎంచుకుని, సుదూర లక్ష్యాల్ని కచ్చితత్వంతో చేరుకుంటాయి.150 కిలోమీటర్ల లక్ష్యం గల రాకెట్ను ఆర్మీ నేరుగా యుద్ధంలో వాడొచ్చు. ఇక, 300 కిలోమీటర్ల రేంజ్ రాకెట్ మరింత శక్తివంతమైంది. ఇది శతృవుల భూభాగంలో ఉన్న లోతట్టు స్థావరాల్లోని లక్ష్యాల్ని కూడా చేరుకోగలదు. ఈ తరహా రాకెట్ వ్యవస్థలో యుద్ధ సమయంలో చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు. ఈ రాకెట్ వ్యవస్థను ప్రైవేట్ సంస్థ తయారు చేసింది.
ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఇలాంటి రాకెట్లు, డ్రోన్లు వంటివి తయారు చేస్తున్నాయి. దీని ద్వారా ఇండియా వీటిని విదేశాల నుంచి కొనుగోలు చేసే అవకాశం తగ్గుతుంది. ఇది భారత రక్షణ వ్యవస్థకే కాకుండా.. ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.