Canada-India relations | న్యూఢిల్లీ: కెనడా- భారత్ మధ్య ఖలిస్థానీ చిచ్చు వల్ల నెలకొన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కెనడాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో భారతీయులకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ‘దౌత్యవేత్తలు, రాయబారులకు బెదిరింపులు వస్తున్నాయి. భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలి. ఖలిస్థానీ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దు’ అని విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ముంబైలో జరగాల్సిన కెనడా సిక్కు సింగర్ శుభ్ కార్యక్రమం రద్దు అయింది.
పారదర్శకంగా విచారణ జరగాలి
కెనడా- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై పలు దేశాలు స్పందించాయి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాలు పేర్కొన్నాయి. ‘ఫైవ్ ఐ’లో కెనడాతో పాటు సభ్యులుగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దీనిపై స్పందించాయి. అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్జీ మాట్లాడారు. ‘కెనడా ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరగాలి.
భారత్ అందుకు సహకరించాలి’ అని ఆయన తెలిపారు. కెనడా- భారత్ మధ్య ఉద్రిక్తతలను పరిశీలిస్తున్నామని ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు. కెనడాతో టచ్లో ఉన్నామని యూకే విదేశాంగ సెక్రెటరీ జేమ్స్ పేర్కొన్నారు. మరోవైపు ట్రూడో అన్ని విషయాలను బయటపెట్టాలని కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పీరే పొలీవర్ చెప్పారు.