న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమైన మారిషస్ చుట్టూ రాజకీయ సునామీ కమ్ముకు వస్తున్నది. అందులో పదేపదే భారత్ పేరు వినిపిస్తున్నది. పెగాసస్ దుమారంతో భారత ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని ఈ తాజా వివాదం సూచిస్తున్నది. ప్రధాని ప్రవింద్ జగ్నాథ్ సన్నిహితుడు, మారిషస్ టెలికం (ఎంటీ) సీఈవో షెర్రీసింగ్ రాజీనామాతో ఇదంతా మొదలైంది.
‘నా విలువలతో రాజీపడి కొనసాగలేకపోతున్నాను.. అది నా కెప్పుడూ ఒక ప్రత్యామ్నాయం కానే కాదు’ అంటూ బాంబు పేల్చారు. ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో ఆయన చేసిన ఆ ప్రకటన ఇప్పుడు మారిషస్ సర్కారుకు ఉచ్చుబిగిస్తున్నది. చినికి చినికి గాలివానగా మారుతున్న ఈ వివాదంలో భారత్ పాత్రపై ప్రశ్నలు ఎగిసిపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సముద్రపు అడుగున 13,500 కిలోమీటర్ల పొడవున వేసిన సౌతాఫ్రికా ఫార్ ఈస్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ (క్లుప్తంగా ‘సేఫ్’) దక్షిణాఫ్రికా, మారిషస్, రీయూనియన్ (ఫ్రాన్స్), భారత్, మలేషియాలను ఇంటర్నెట్తో కలుపుతుంది.
దాని ల్యాండింగ్ స్టేషన్ మారిషస్లోని నిషేధిత ప్రాంతమైన బాయి-దు-జకోతేలో ఉంటుంది. అక్కడికి ఒక భారతీయ టీమ్ను అనుమతించమని ప్రధాని జగ్నాథ్ తనపై వత్తిడి తెచ్చారని షెర్రీ సింగ్ తదుపరి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో బైటపెట్టారు. అంటే నెట్ ట్రాఫిక్పై భారత్ తరఫున నిఘాకు మారిషస్ ప్రధాని అనుమతించారని దీని సారాంశం. ఈ వివాదం వెలుగు చూడగానే ఆత్మరక్షణలో పడిన మారిషస్ ప్రధాని దర్యాప్తునకు ఆదేశించారు.
భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం దీనిపై మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పూర్తి వివరాలు తనవద్ద లేవన్నారు. మారిషస్ ప్రధాని చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. అది సరిపోతుందని అన్నారు. వివాదానికి తెరతీసిన ఎంటీ మాజీ సీఈవో షెర్రీ సింగ్ మౌనదీక్షలోకి వెళ్లారు. దీనిపై మారిషస్ ప్రధాని జగ్నాథ్ మండిపడుతున్నారు. అగ్గి రాజేసి ఏమీ చెప్పకుండా ఉండిపోవడం ఏమిటని అంటున్నారు.
షెర్రీ సింగ్ వద్ద ఏవైనా సాక్ష్యాలుంటే పోలీసుల వద్ద బయటపెట్టొచ్చు కదా అంటున్నారు. దీనిపై షెర్రీ సింగ్ స్పందిస్తూ.. నా ప్రమేయం ఉన్నా లేకున్నా రాజకీయ సునామీ తప్పదు అని పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఈ వివాదంతో సంబంధం లేదని తేల్చి చెప్తూనే భారత సాంకేతికుల బృందం నాయకుడు కేబుల్ నిఘా కోసం వచ్చారని స్పష్టం చేశారు. కేబుల్ నిఘాకు ఎందుకు అనుమతించారని అడిగితే ప్రధాని (జగ్నాథ్) సర్వోన్నత నాయకుడని, ఆదేశాలు పాటించక తప్పదని సమాధానమిచ్చారు.
కానీ తృతీయ పక్ష చేతుల్లోకి ప్రైవేటు డాటా వెళ్లడం తాను ఆమోదించలేనని, అది నమ్మకద్రోహమే అవుతుందని అన్నారు. ఈ వివాదం నేపథ్యంలో భారతీయ ఐపీఎస్ అధికారి కుమరేశన్ ఇలంగో మారిషస్ జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో భారత గూఢచార సంస్థ రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) అధిపతి పదవి కోసం పరిశీలించిన అధికారుల్లో ఇలంగో ఒకరు.
శ్రీలంకలోని భారత హైకమిషన్లో పనిచేసిన ఆయన అధ్యక్షుడు మహింద రాజపక్స పదవీచ్యుతిలో కీలక పాత్ర నిర్వహించారని చెప్పుకొంటారు. అలాంటి వ్యక్తిని ఎందుకు మారిషస్ ఎన్ఎస్ఏగా నియమించారని అడిగితే.. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అని ప్రధాని జగ్నాథ్ సమాధానమివ్వడం గమనార్హం.