న్యూఢిల్లీ : బ్రహ్మోస్ మిస్సైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్ను భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎస్యూ-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి క్షిపణిని ప్రయోగించగా.. బంగాళాఖాతం సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో తాకిందని భారత వాయుసేన తెలిపింది. ఈ సందర్భంగా ‘డైరెక్ట్ హిట్’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.
తాజా పరీక్షలో ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి రేంజ్ను మరింత అభివృద్ధి చేశారు. రేంజ్ పొడిగించిన తర్వాత బ్రహ్మోస్ ను పరీక్షించడం ఇదే తొలిసారి. గతంలో బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్ 290 కిలోమీటర్లు కాగా, దాన్ని 350 కిలోమీటర్లకు పెంచారు. తాజా ప్రయోగం ద్వారా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భూతల, సముద్రతల లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించగలిగే సామర్థ్యం భారత వాయుసేన సొంతమైంది.