పట్టభద్రుల్లో సగం మందికి కూడా స్కిల్స్ లేవు
ఇండియా స్కిల్స్ రిపోర్టు-2022 వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వారిలో ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి..? ఎంతమందికి ఉద్యోగం వచ్చేటంత నైపుణ్యాలు ఉన్నాయి..? ఇవే విషయాలను ఇండియా స్కిల్స్ రిపోర్టు వెల్లడించింది. దేశంలోని పట్టభద్రుల్లో సగం మందికి కూడా ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవని తెలిపింది. అయితే ఏటేటా నైపుణ్యాలు పెరుగుతున్నాయని పేర్కొన్నది. ఉద్యోగార్హతలు ఉన్న వారు ఈ ఏడాది 45.9 శాతం ఉండగా, వచ్చే ఏడాది ఇది 46.2 శాతం ఉండనున్నదని నివేదిక వెల్లడించింది. 2019లో ఇది 47.38 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
అత్యధికంగా బీటెక్ వారికే..
నివేదిక ప్రకారం.. అన్ని డిగ్రీ కోర్సుల్లోకెల్లా బీటెక్ పూర్తి చేసుకున్న వారే ఎక్కువగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. 55.15 శాతం మందిలో జాబ్ చేసేందుకు కావాల్సిన నైపుణ్యాలున్నాయి. ఆ తర్వాతి స్థానంలోఎంబీఏ, బీఫార్మసీ విద్యార్థులు ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు చివరి స్థానంలో ఉన్నారు. 2022లో ఇంటర్నెట్, బిజినెస్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, బీమా రంగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తాయి. వెల్లడించింది. అదే 2021లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంటర్నెట్ బిజినెస్ రంగాలు అధికంగా ఉద్యోగాలు ఇచ్చాయి.