(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ఫ్రాన్స్కు చెందిన వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ ఆర్థికవేత్తలు పలు కీలక సూచనలు చేశారు. దేశంలోని సంపన్నులపై ‘కరోడ్పతి ట్యాక్స్’ విధించాలని సిఫారసు చేశారు. 2010 తర్వాత ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తిన కరోడ్పతిలు సంపాదించిన సొత్తుపై ముఖ్యంగా ఈ పన్ను విధించాలని పేర్కొన్నారు. సంపదపై పన్ను, వారసత్వ పన్ను పేరిట ఈ ట్యాక్స్ ఉండాలని సూచించారు. రూ. 10 కోట్ల వరకూ సంపాదన ఉన్నవారికి ఒకవిధంగా, రూ. 100 కోట్ల సంపాదన ఉన్నవారికి కొంచం ఎక్కువగా, రూ. 100 కోట్లకు పైగా సంపాదన ఉన్నవారికి మరింత ఎక్కువగా ట్యాక్స్ ఉండాలని ఓ పట్టికను విడుదల చేశారు. ఈ కొత్త ట్యాక్స్ నిబంధనల ప్రభావం దేశంలో సంపన్నులుగా ఉన్న 0.04 శాతం మందిపై మాత్రమే ఉంటుందని, మిగతా 99.96 శాతం మంది జనాభాపై ఏ ప్రభావం ఉండబోదని వెల్లడించారు.
దేశంలోని ఒక శాతం జనాభా చేతిలో 40.1 శాతం సంపద ఉన్నదని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఈ ఒక్క శాతం జనాభా సంపన్నులన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. 2014-15 నుంచి 2022-23 మధ్యకాలంలో సంపదను కేంద్రీకరించడం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగాయని వెల్లడించారు. పన్నుల విధానాన్ని పునర్నిర్మించడం ద్వారా సంపన్నుల నుంచి సేకరించిన డబ్బుతో సగటు భారతీయుడికి విద్య, వైద్యం, పోషకాహారం అందించే వీలు కలుగుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.